వాసవి మాత జయంతి రాష్ట్ర పండుగగా గుర్తింపు
హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్యులు
వెంకటాపురం, ఏప్రిల్24, తెలంగాణ జ్యోతి: ఆర్యవైశ్యుల కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఆర్యవైశ్య కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలను ఇకపై ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించగా, ఈ ఏడాది ఏప్రిల్ 26న పర్వదినం ఖరారైంది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యవైశ్యులను గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతలకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బచ్చు పూర్ణచంద్రరావు, వేల్పూరి లక్ష్మీనారాయణ, కలకోట సంతోష్ కుమార్, మడుగురి శ్రీనివాస్, మడుగురి వేణుమాధవ్, వేల్పూరి శ్రీనివాస్, ఎల్లంకి శ్రీనివాస్, కోట మల్లికార్జున రావు, వేల్పూరి గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.









