గ్రామ గ్రామాన ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు
అశేష భక్తజనంతో ఆలయాలు కిక్కిరిసిన వేళ
జయరామ నామస్మరణలతో మార్మోగిన గ్రామాలు
వెంకటాపురం నూగూరు, మార్చి 27, తెలంగాణ జ్యోతి: శ్రీరామనవమి సందర్భంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని అనేక గ్రామాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తుల జయరామ, శ్రీరామ, సీతారామ నామస్మరణలతో గ్రామాలు మార్మోగగా, ఆలయాలు భక్తజనంతో కిక్కిరిశాయి. ఎదిర, సూరవీడు, రామచంద్రపురం, పాత్రాపురం, చొక్కల, బెస్తగూడెం, మరికాల, వాజేడు, శ్రీరామ్నగర్, చీకుపల్లి, ప్రగల్లపల్లి తదితర గ్రామాల్లో ఈ మహోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగాయి. మండల కేంద్రం వెంకటాపురంలో జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద, అప్పాలవారి వీధిలో స్వామివారి తిరుకల్యాణం ఘనంగా జరిగింది. అలాగే మంగపేట రోడ్డులోని శ్రీ ఆంజనేయస్వామి మండపం వద్ద కూడా విశేషంగా నిర్వహించారు. తిరుకల్యాణం అనంతరం భక్తులకు బెల్లం పానకం, వడపప్పు తదితర ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఘనంగా అన్న ప్రసాద వితరణ
హైస్కూల్ మండపంలో మహా అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించగా వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు గుడవర్తి నరసింహమూర్తి ఆధ్వర్యంలో, వారి తల్లిదండ్రులు కీ.శే. గుడవర్తి శ్రీమన్నారాయణ, కీ.శే. సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం ఈ అన్నప్రసాదం నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు కూడా ప్రసాదం అందేలా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. వేద పండితులు కృష్ణమాచార్యులు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించగా, భక్తులు దాతలను, కమిటీని అభినందించారు. అలాగే అప్పాలవారి వీధిలో కూడా అన్నప్రసాద కార్యక్రమం జరిగింది.









