బొగత వద్ద పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
వెంకటాపురం నూగూరు, మే 23, తెలంగాణ జ్యోతి: రానున్న వర్షాకాల టూరిజం సీజన్ను దృష్టిలో ఉంచుకుని ములుగు జిల్లాకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. శనివారం వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలోని బొగత జలపాతాన్ని సందర్శించి పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన, పర్యాటకుల కోసం త్రాగునీరు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, సీసీ కెమెరాలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు కల్పించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.









