నిర్భయ నిధులతో మహిళల భద్రతకు పెద్దపీట
ములుగు, మార్చి 26, తెలంగాణ జ్యోతి: నిర్భయ నిధులతో మహిళల భద్రతకు పెద్దపీట వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మహిళలు మరియు బాలికల రక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ నిధి పథకం కింద “ఇన్క్లూజివ్ సిటీస్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్” పైలట్ ప్రాజెక్ట్ అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మహిళా భద్రతా ప్రమాణాలను మరింత మెరుగు పరచేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. మహిళలు, బాలికలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు పింక్ ఆటోస్ ప్రారంభించడం, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న బాలింత మహిళలు మరియు వారి శిశువుల కోసం పని ప్రదేశాల్లో ప్రత్యేక క్రెష్ సెంటర్లు, డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని మేడారం, లక్నవరం, రామప్ప, బోగత, మల్లూరు, దేవాదుల వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రత్యేక భద్రతా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ అంశాలతో కూడిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వానికి త్వరితగతిన సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, డీడబ్ల్యూఓ ప్రేమలత, మున్సిపల్ కమిషనర్ టి. రమేష్, ఆర్టీవో శ్రీనివాస్, డీఎంసీ రమా తదితర అధికారులు పాల్గొన్నారు.









