విధి నిర్వహణలో విషాదం..
ఫారెస్ట్ బేస్ క్యాంప్ వాచర్ మృతి
సెక్షన్ ఆఫీసర్కు తీవ్ర గాయాలు
వెంకటాపురం, మే 11, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో విధి నిర్వహణకు వెళ్తున్న సమయంలో ఆదివారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఫారెస్ట్ బేస్ క్యాంప్ వాచర్ కల్లూరి లక్ష్మయ్య (56) మృతి చెందగా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దేవయ్య తీవ్రంగా గాయపడ్డారు. వెంకటాపురం-ఏడ్జెర్లపల్లి రోడ్డులో మరికాల సమీపంలోని టేకుప్లాంటేషన్ వద్ద ఈప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అర్ధరాత్రి సమయంలో అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటం తో భద్రాచలం తరలిస్తుండగా రాజుపేట సమీపంలో లక్ష్మయ్య మార్గ మధ్యలో మృతి చెందారు. దేవయ్య చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతుడు లక్ష్మయ్య గత పదేళ్లకు పైగా వెంకటాపురం ఫారెస్ట్ శాఖలో గెస్ట్ హౌస్ వాచ్మన్గా, అనంతరం బేస్ క్యాంప్ వాచర్గా విధులు నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన లక్ష్మయ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా, వెంకటాపురం రజకవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృత దేహాన్ని సోమవారం ఉదయం వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించ గా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









