గ్రామ పంచాయతీలో డబుల్ డ్రా దందా..?
ఒకే సామగ్రి కొనుగోలుకు రెండుసార్లు చెల్లింపులపై అనుమానాలు..
రాజన్నపేట ఖర్చుల లెక్కలపై గ్రామస్థుల ప్రశ్నల వర్షం..
కన్నాయిగూడెం, మే 9, తెలంగాణ జ్యోతి: మండలంలోని రాజన్నపేట గ్రామ పంచాయతీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చుల వివరాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎల్ఈడీ బల్బులు, హోల్డర్లు, క్యాప్స్, వైర్ బండిల్స్ కొనుగోలు పేరుతో ఒకే తరహా పనికి రెండుసార్లు నిధులు డ్రా చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మార్చి 23, 2026న “Purchase of 15 Watts LED Bulbs, Holders, Caps, Wire Bundles” పేరుతో ఒకసారి రూ.42,500, మరోసారి రూ.43,900 చెల్లింపులు జరిగినట్లు రికార్డుల్లో నమోదై ఉన్నాయని పేర్కొంటున్నారు. ఒకే సామగ్రి కొనుగోలు పేరుతో తక్కువ వ్యవధిలో రెండు విడతలుగా నిధులు వినియోగించడంపై గ్రామంలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో గ్రామపంచాయతీ ఖాతాలో భారీ మొత్తం లో నిధులు జమ అవుతున్నప్పటికీ ఖర్చుల విషయంలో పారదర్శకత పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకు రావాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.









