గోదావరి లంకలో అక్రమ ఇసుక తవ్వకాలు అడ్డుకట్ట
రెండు జెసిబిలు, ట్రాక్టర్ సీజ్
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 20, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా అంకన్నగూడెం ట్రైబల్ ల్యాండ్ ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో గోదావరి మధ్యలో ఉన్న లంక భూముల్లో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. రామచంద్రపురం, అంకన్నగూడెం, వీరభద్రారం గ్రామాలకు చెందిన గిరిజన రైతులు తాతముత్తాతల కాలం నుండి సాగుచేస్తున్న ఈ భూముల్లో గిరిజనేతర వలస భూస్వాములు అక్రమ పట్టాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దూడ సుదర్శన్ రెడ్డి, దాచేపల్లి సూర్య కుమారి పేర్లపై సుమారు 35 ఎకరాలపైగా భూముల్లో ఇసుక మేటలు తొలగించి 2.77 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. దీనిపై గిరిజన రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం ఏటూరునాగారం ప్రజాదర్బార్లో గిరిజన రైతులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి అక్రమ పట్టాలు రద్దు చేయాలని, ఇసుక తరలింపును నిలిపివేయాలని కోరారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. గోదావరి లంకలో రహదారి పనుల పేరిట జరుగుతున్న అక్రమ తవ్వకాలను గుర్తించిన అధికారులు రెండు జెసిబిలు, ఒక ట్రాక్టర్ను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను వెంకటాపురం పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం.









