ఆదివాసుల భూ సమస్యలు పరిష్కరించాలి
ప్రజాదర్బార్లో కలెక్టర్కు వినతిపత్రం అందజేత
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 20, తెలంగాణ జ్యోతి: ఏజెన్సీ ప్రాంతంలో ఏండ్ల తరబడి సాగు చేస్తున్న ఆదివాసులకు భూములపై హక్కులు కల్పించి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గొండ్వాన సంక్షేమ పరిషత్ నాయకులు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ను కోరారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ కలెక్టర్ను కలిసి భూ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వెంకటాపురం మండలం కొమరం భీం కాలనీలో ఆదివాసులు ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములపై ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండి పడ్డారు. గతంలో గిరిజనేతరుల నుంచి భూములను కాపాడుకున్నప్పటికీ ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు వాటిని తమ భూమిగా పేర్కొనడం అన్యాయమన్నారు. వాడగూడెం గ్రామ సర్వే నెంబర్ 27లో దాదాపు 140 ఎకరాల రెవెన్యూ భూమి ఉన్నప్పటికీ దాన్ని స్వాధీనం చేసుకోవడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. అదే భూమిలో గిరిజనేతరులకు పహాని నమోదు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఫారెస్ట్ భూముల్లో అక్రమంగా పట్టాలు పొందుతున్న గిరిజనేతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొమరం భీం కాలనీ ఆదివాసుల సమస్యలు పరిష్కరించకపోతే ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు తురస చంటి, ఆదివాసులు రమేష్, సంతోష్, లక్ష్మయ్య, రాజేష్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.









