ఒకరికొకరు దాడులు తప్ప.. ప్రజల శ్రేయస్సు అవసరం లేదా ?
– ఇంకెప్పుడూ మంథని నియోజకవర్గం అభివృద్ధి ?
– దాడులు చేసే నాయకులు కావాలా… దగ్గరుండి పనిచేసే సేవకులు కావాలా…
– బీఎస్పీ అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి
తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: ఒకరికొకరు దాడులు తప్ప .. ప్రజల శ్రేయస్సు అవసరం లేదా, ఇంకెప్పుడూ మంథని నియోజక వర్గం అభివృద్ధి, దాడులు చేసే నాయకులు కావాలా… దగ్గరుండి పనిచేసే సేవకులు కావాలా అని బీఎస్పీ అభ్యర్థి చల్లా నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో గత పాలకుల కాలంలో మంథని నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడింది, దాడుల్లో ముందుందని తీవ్ర స్థాయిలో ఆయన విమర్శించారు. మంథని నియోజకవర్గ బాగుపడాలంటే బహుజన సమాజ్ పార్టీ రావాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి అంటే ఏంటో చూసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడి నాయకులకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకే సమయం లేదని, ఇంకా ప్రజల శ్రేయస్సు ఎప్పుడు పట్టించుకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. పరిపాలనంటే దాడులు చేసుకునే తత్వం కాదని, పరిపాలన అంటే అందరిని కలుపుకుపోయే తత్వమని ఆయన సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకులాలు ఎలా అభివృద్ధి చెందాయో, బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అలా అభివృద్ధి చెందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మంథని నియోజక ప్రజల్ని అభివృద్ధిలో అంబరాన్ని ఎక్కిస్తానని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయంలో దాడులు విరుద్ధమని, నేతల కోసం ప్రజలు దాడులు చేసుకుంటే ప్రజలకే గాయాలు అవుతున్నాయి తప్ప నేతలకు ఎలాంటి బాధ లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ఇక్కడి ప్రజల ఆలోచించి, వచ్చే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటేసి, ఒక్కసారి అవకాశం కల్పించాలని ఆయన కోరారు.