ఎయిడ్స్ పరీక్షలు ఎక్కడ చేయించుకునేదీ.. ?!
– జిల్లాలోనే ఐసీటీసీలు లేకపోవడం శోచనీయం
– బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : సమాజాన్ని గడగడ లాడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని గుర్తించేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరీక్ష కౌన్సిలింగ్ కేంద్రాలు లేకపోవడం శోచనీయమని మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి భాస్కర వెంకటరమణ అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ తో పాటు చిట్యాలలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వీటిలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్ కేంద్రాలు (ఐసిటిసిలు) గత 19 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండగా కేంద్ర ప్రభుత్వంలోని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రేషనలైజేషన్ పేరిట ఐసీటీసీ కేంద్రాలను ఎత్తివేయడం దారుణమైన విషయమని వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్ఐవి పరీక్ష ఎంతో అత్యవసరమని, ఆవశ్య కమని భావిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కేంద్రంలోని వందపడకల మాతా శిశు జనరల్ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీలో కూడా ఐ సి టి సి లేని విషయాన్ని జాతీ య సంస్థలకు నివేదించకపోవడం జిల్లా అధికార యంత్రాం గం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ఐసిటిసి కేంద్రాలు లేని జిల్లా ఏదంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గానే చెప్పుకోవచ్చు అని విమర్శించారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మహాదేవపూర్ ప్రాంతం తో పాటు చిట్యాల, భూపాలపల్లి ఆసుపత్రులలో ఐసిటిసిలు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహాదేవ పూర్ కేంద్రంగా ఐసిటిసి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే తెలంగాణ మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంత ప్రజలకు గిరిజన గూడాలాలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన సూచించారు. అలాగే మహాదేవపూర్, చిట్యాల ఐ సి టి సి ల తో పాటు ఇతర ప్రాంతాలలో హెచ్ఐవి పరీక్షలు చేయించుకుని ఎయిడ్స్ బారిన పడిన బాధితులు, ఈ ప్రాంతంలో సుమారుగా ఉన్నటువంటి వారికోసం ఏ ఆర్ టి మందులు మహాదేవపూర్ కేంద్రంలో అందుబాటులో ఉంచాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ కోరారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లకు వినతి పత్రాలు సమర్పించినట్లు వెంకటరమణ విలేకరులకు వివరించారు.