ఏడాదికోసారి వికసించే మే పుష్పం కనువిందు
అరుదైన ‘ఫుడ్ బాల్ లిల్లీ’ పువ్వును తిలకించేందుకు ఆసక్తి
వెంకటాపురం, మే 20, తెలంగాణ జ్యోతి: వాజేడు మండలం పెద్దగొల్లగూడెంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే అరుదైన మే పుష్పం బుధవారం అందరినీ ఆకట్టుకుంది. మాజీ సర్పంచ్ జజ్జరి మేనక సత్యనారాయణ ఇంటి పెరట్లో ఉన్న ఈ మొక్క ప్రతి సంవత్సరం మే నెలలో తొలకరి చినుకులతో మొలకెత్తి అందమైన పుష్పాన్ని పూయడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ‘ఫుడ్ బాల్ లిల్లీ’గా కూడా పిలిచే ఈ అరుదైన పుష్పం రంగుల హరివిల్లులా అందాలను వెదజల్లుతూ స్థానికులను ఆకర్షిస్తోంది. అరుదుగా కనిపించే ఈ పుష్పాన్ని చూసేందుకు పలువురు గ్రామస్థులు ఆసక్తిగా తరలివచ్చి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.








