మిషన్ భగీరథ పైప్లైన్పై రోడ్డు నిర్మాణం
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
ములుగు, ఏప్రిల్29, తెలంగాణజ్యోతి:ములుగు మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ పైప్లైన్పై నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ చర్యలపై 9వ వార్డ్ కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్ నిధుల కింద మున్సిపాలిటీ కార్యాలయం నుంచి దళిత కాలనీ వరకు, అలాగే పత్తిపల్లి రోడ్డుకు ఆనుకొని గొల్లవాడ నుంచి దళిత కాలనీ వరకు 50 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. అయితే గతంలో 12 అడుగుల రోడ్డు పక్కనే వేసిన మిషన్ భగీరథ పైప్లైన్ను ప్రస్తుతం తొలగించి కొత్త రహదారి విస్తరణకు అనుగుణంగా మార్చాల్సి ఉండగా, ఖర్చు పెరుగుతుందనే కారణంతో అదే పైప్లైన్పై రోడ్డు నిర్మాణం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఇది తమ పరిధిలో కాదని, పంచాయతీరాజ్ శాఖదని చెప్పగా, అక్కడి అధికారులు మిషన్ భగీరథ శాఖపై బాధ్యత నెట్టివేస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ అధికారులు కూడా ఇది మున్సిపాలిటీ పరిధి విషయమని పేర్కొనడంతో శాఖల మధ్య సమన్వయం లేకుండా పనులు కొనసాగుతున్నాయని విమర్శించారు. భవిష్యత్తులో పైప్లైన్ లీకేజీలు లేదా మరమ్మత్తులు అవసరమైతే కొత్తగా వేసిన రోడ్డు పగలగొట్టాల్సి వచ్చి ప్రజాధనం వృథా అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని పైప్లైన్ను సరైన ప్రదేశానికి మార్చి రోడ్డు నిర్మాణం చేపట్టేలా కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు.









