రాష్ట్ర బాధ్యతలతో పూర్ణచంద్రరావుకు మరింత ప్రాధాన్యం
రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు
వెంకటాపురం, మార్చి 16, తెలంగాణ జ్యోతి: రాష్ట్ర బాధ్యతలతో పూర్ణచంద్రరావుకు మరింత ప్రాధాన్యం లభించినట్లయింది. ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన మెడికల్ షాప్ యజమాని బచ్చు పూర్ణచంద్రరావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్టేట్ మెడికల్ షాప్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై ఘన విజయం సాధించారు. జిల్లా యూనియన్లో విశిష్ట సేవలు అందిస్తూ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో గుర్తింపు పొందిన ఆయనను రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శిగా నియమించింది. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ పదవికి ఎంపిక కావడం ప్రాంతానికి గర్వకారణమని మండల యూనియన్ కమిటీ, గ్రామీణ వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన స్వగృహంలో మండల మెడికల్ షాప్స్ అసోసియేషన్, గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో పట్టు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు, మెడికల్ షాప్ యజమానులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సంఘంతో కలిసి పనిచేస్తా నని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. అలాగే సన్మానం నిర్వహించిన మండల యూనియన్, గ్రామీణ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.









