నాంచారమ్మ ఆలయంలో క్షుద్ర పూజల కలకలం..?
ఏఐ యుగంలోనూ మూఢనమ్మకాలు
అవగాహన కల్పించడంలో విఫలమైన అధికారులు
వెంకటాపూర్, ఏప్రిల్ 16, తెలంగాణ జ్యోతి: వెంకటాపూర్ మండలం లోని రామానుజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎరుకల నాంచారమ్మ ఆలయంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు బయటపడటంతో ప్రాంతంలో కలకలం రేగింది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నాంచారమ్మ జాతర నిర్వహించే నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన వారు, సమీప పంట పొలాల రైతులు కలిసి ఆలయంగా పిలవబడే పంచకూటాలయంలో అనుమానాస్పద పూజా చిహ్నాలను గుర్తించారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, జంతు బలులతో చేసిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. ఏఐ యుగంలోనూ మూఢనమ్మకాల పేరుతో ఇలాంటి క్షుద్ర పూజలు కొనసాగడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని స్థానికులు అంటున్నారు. అర్ధరాత్రి సమయంలో శ్మశానాలు, రోడ్ల కూడళ్ల వద్ద కూడా ఇలాంటి పూజలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగిన ఘటనలు ఉండటంతో, మరోసారి జాతరకు ముందు గుప్తనిధుల కోసం పూజలు చేశారా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూఢనమ్మకాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.









