గర్భస్థ లింగ నిర్ధారణపై అవగాహన సదస్సు
తల్లి-శిశు సంరక్షణపై వైద్యుల సూచనలు
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 08, తెలంగాణ జ్యోతి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం, తల్లి-శిశు సంరక్షణపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు జిల్లా సూపరింటెండెంట్ డా. పాలకుర్తి జగదీశ్వర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టకాహారాన్ని తీసుకుంటూ గర్భధారణ ప్రారంభం నుండి డెలివరీ వరకు క్రమం తప్పకుండా వైద్యశాలకు రావాలని, వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయించకూడదని హెచ్చరించారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమై నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం వైద్యశాల సూపరింటెండెంట్ డా. మారోజు సురేష్ కుమార్, డా. ప్రవీణ్, డా. ప్రదీప్, డా. శివాజీ, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ శాంతకుమారి, నర్సింగ్ ఆఫీసర్లు జి. ఉషా, పి. ఉషా, కే. వరలక్ష్మి, నాగలక్ష్మి, ఇందు, సూపర్వైజర్ తులసిబాబు, సిబ్బంది నవీన్, చంద్రశేఖర్, బాలరాజు, ఫార్మాసిస్టు లీలారాణి తదితరులు పాల్గొన్నారు.









