బాలల కంటి ఆరోగ్యం అత్యంత ప్రధానమైనది : డాక్టర్ నరహరి
విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ
ములుగు, ఏప్రిల్ 1, తెలంగాణ జ్యోతి : బాలలు కంటి ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎక్కువగా టీవీ, మొబైల్ చూడొద్దని ప్రముఖ వైద్యులు నరహరి సూచించారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఆర్బీఎస్కే, జిల్లా ఆందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యం లో బుధవారం కంటి పరీక్షలు నిర్వహించగా చూపు మందగించిన 22 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరహరి మాట్లాడుతూ కంటి చూపుపై నిర్లక్ష్యం చేయకుండా అందించిన అద్దాలను తప్పనిసరిగా వినియోగించాలని, తద్వారా విద్యాభ్యాసంలో ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపారు. గత ఏడాది 19వేల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 1222మందికి ఉచితంగా కంటి అద్దాలు అందించినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 7659మందికి కంటిపరీక్షలు నిర్వహించి 626మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అందులో 147మందికి కంటి అద్దాలు అందించినట్లు డాక్టర్ నరహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి. అంకయ్య, హెల్త్ సూపర్వైజర్ దిలీప్, ఉపాధ్యాయులు, ఆర్బీఎస్కే ఏఎన్ఎం రజిని, విద్యార్థులు పాల్గొన్నారు.










