శ్రీరామనవమికి ముమ్మర ఏర్పాట్లు
వెంకటాపురం హై స్కూల్ వద్ద మహా అన్నప్రసాద వితరణ
వెంకటాపురం నూగూరు, మార్చి 26, తెలంగాణ జ్యోతి: శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మండలంలోని గ్రామాల్లో మండపాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. శుక్రవారం ఉదయం స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహణ కోసం ఆయా కమిటీలు చలువ పందిళ్లు వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల కేంద్రమైన వెంకటాపురం హై స్కూల్ ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బిఆర్ఎస్ జిల్లా నాయకులు, వెంకటాపురం వాస్తవ్యులు గుడవర్తి నర సింహమూర్తి ఆధ్వర్యంలో కీర్తిశేషులైన వారి తల్లిదండ్రులు కీ.శే. శ్రీమన్నారాయణ, కీ.శే. సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం స్వామివారి కళ్యాణ మండపం వద్ద మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహా అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








