హామీల అమలు కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం
ముఖ్య అతిథిగా ఎడ్ల అశోక్ రెడ్డి హాజరు
ములుగు, మార్చి 20, తెలంగాణ జ్యోతి: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. యువతకు జాబ్ కాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్ల పెంపు, రైతులకు రైతు భరోసా, పేదలకు గృహ నిర్మాణ పథకం వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ములుగు జిల్లాలో రైతులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రెవెన్యూ సహా అన్ని శాఖలు ప్రజలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం మాట్లాడుతూ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచిన ప్రజలను మోసం చేయకూడదని, వెంటనే హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, ఎస్టీ మోర్చా ప్రతినిధి గుగులోతు స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీలమంతుల రవింద్రాచారి, జాడి వెంకట్, నగరపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.






