సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలి
ములుగు, ఫిబ్రవరి 4, తెలంగాణ జ్యోతి: సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్ఎస్ సిటియూ)లో ఫార్మాసిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి తక్షణమే బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ కోర్సులను ప్రారంభించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఎల్. రవి డిమాండ్ చేశారు. త్వరలో ప్రారంభించనున్న అండర్గ్రాడ్యుయేట్ కోర్సులైన ఈసీఈ, ఈఈఈ, సిఎస్ఈలతో పాటు బి.ఫార్మసీని కూడా ప్రవేశపెట్టాలని, అలాగే పీజీ స్థాయిలో ఎం.ఎస్సీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్తో పాటు అన్ని స్పెషలైజేషన్లతో ఎం.ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలని ఆయన కోరారు. తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని ఏ ఒక్క సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఫార్మసీ విద్య లేకపోవడం దురదృష్టకరమని, ఉత్తర భారతదేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో మాత్రం ఫార్మసీ కోర్సులు విస్తృతంగా ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల పేద, దళిత, గిరిజన విద్యార్థులు ఉన్నత వృత్తిపరమైన విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీ వీసీ, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ఫార్మసీ కోర్సులు ప్రారంభించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.






