కన్నాయిగూడెం పబ్లిక్ టాయిలెట్ భవనంలో పగుళ్లు..!
– నాణ్యతపై అనుమానాలు
కన్నాయిగూడెం, ఫిబ్రవరి 4 (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కన ప్రజల వినియోగం కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ భవనంలో ప్రారంభానికి ముందే పగుళ్లు కనిపించడం కలకలం రేపుతోంది. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోడలపై చీలికలు ఏర్పడి ప్లాస్టర్ ఊడిపోతుండటంతో పాటు, నిర్మాణం పూర్తై ఎక్కువ కాలం గడవకపోయినా గోడల మధ్య పగుళ్లు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనంతో చేపట్టిన ఈ నిర్మాణం ఇలాంటి స్థితికి చేరుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, అధికారులు తక్షణమే స్పందించి భవనాన్ని పరిశీలించి నాణ్యమైన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.






