మంగవాయి, ఎదిర పేసా గ్రామసభలు రద్దు చేయాలి
చట్ట విరుద్ధంగా తీర్మానాలు జరిగాయి
వెంకటాపురం నూగూరు, మే 19, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మంగవాయి, ఎదిర గ్రామాల్లో నిర్వహించి ఆమోదించిన పేసా గ్రామసభలను తక్షణమే రద్దు చేయాలని జై ఆదివాసి యువశక్తి జిల్లా అధ్యక్షురాలు కొడిపె నయోమి మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, పేసా చట్టంలోని సెక్షన్ 4(1) ప్రకారం ఆయా గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన వారే గ్రామసభలో పాల్గొని, సర్పంచ్ అధ్యక్షతన లేదా ఆయన గైర్హాజరీలో పేసా ఉపాధ్యక్షులు లేదా గ్రామ పెద్ద ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఓటు హక్కు లేని పేసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, మండల అధికారులు పాల్గొని చట్ట విరుద్ధంగా తీర్మానాలు చేయించారని ఆరోపించారు. ఎన్నుకోబడిన పేసా కార్యదర్శి రికార్డు చేయకుండా, పేసా అధ్యక్షులు, కార్యదర్శుల సంతకాలు లేకుండానే అమాయక గిరిజన ప్రజలను మోసం చేస్తూ గ్రామసభలను అక్రమంగా ఆమోదించారని విమర్శించారు. చట్ట ప్రకారం గిరిజనుల స్వయం నిర్ణయాధికారానికి అనుగుణంగా తిరిగి పేసా గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ చట్టవిరుద్ధ తీర్మానాలు, సంబంధిత అధికారులపై న్యాయస్థానం, నేషనల్ ఎస్టీ కమిషన్ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.









