వాజేడులో హిందూ ధర్మ సమ్మేళన సభకు భారీ స్పందన
కాషాయ కండువాలతో తరలివచ్చిన జనం
ఆర్ఎస్ఎస్ నేత కాచం రమేష్ ప్రసంగానికి విశేష ఆదరణ
వాజేడు, ఏప్రిల్ 15 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన హిందూ ధర్మ సమ్మేళన సభ భారీ జనసందోహంతో విజయవంతంగా ముగిసింది. సాయంత్రం ప్రారంభమైన ఈ సభకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి హిందూ బంధువులు కుటుంబ సమేతంగా కాషాయ కండువాలు ధరించి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణం మొత్తం కుర్చీలతో నిండిపోగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్, సౌండ్ సిస్టంతో కోలాహలంగా మారింది. శ్రీశ్రీశ్రీ విశ్వ బ్రహ్మ శ్రీ పూజ్య వీరధర్మజ స్వామీజీ ఆశీర్వచనాలు అందించగా, ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ హిందూ ధర్మం, సంస్కృతి, ఐక్యత అవసరంపై ఉత్సాహభరిత ప్రసంగం చేశారు. “హిందువుగా జీవించు.. హిందువునని గర్వించు.. గడప లోపలే కులం.. గడప దాటితే హిందువులం” అనే నినాదంతో సాగిన ఆయన ప్రసంగానికి సభికుల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు నిర్వహించారు. అనంతరం హాజరైన భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. హిందూ సమాజంలో చైతన్యం పెంపొందించేందుకు, దేశాన్ని విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో ఈ సభను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.









