ఎస్ఎస్సీ ప్రతిభావంతులకు సన్మానం
విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి: ఎంఈఓ
వెంకటాపురం నూగూరు, మే 17, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం విద్యా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఎస్ఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. 2025-26 విద్యా సంవత్సరంలో మండలంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో తొలి ముగ్గురిని తల్లిదండ్రుల సమక్షంలో శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికతో కెరీర్ మార్గదర్శకత్వం పొందుతూ విజయవంతమైన జీవితానికి పునాది వేయాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారి తేజవత్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులే భవిష్యత్ నిర్మాణ శిల్పులని, పాఠశాల దశ నుంచే ఉన్నత లక్ష్యాలతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోరిక స్వరూప్ సింగ్, శ్రీకాంత్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.









