వడదెబ్బతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
వెంకటాపురం, మే 26, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సురవీడు కాలనీ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తాటి నరేష్ (34) వడదెబ్బతో మృతి చెందిన ఘటన విషాదం నింపింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో ఇసుక తోలకం పనుల కోసం ట్రాక్టర్ నడిపిన నరేష్ రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. మంగళవారం ఉదయం అతని భార్య తాటి భవాని నిద్రలేచి చూడగా మంచంపై అపస్మారక స్థితిలో ఉండగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి తాటి చిన్ని, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మండుటెండల్లో రోజంతా పని చేయడం వల్ల వడదెబ్బ తగిలి నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై వెంకటాపురం ఎస్సై కే తిరుపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.









