భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి
ఏజెన్సీ యువత భవిష్యత్తు కోసం ఎమ్మెల్యేకు వినతి
వెంకటాపురం నూగూరు, మే 25, తెలంగాణ జ్యోతి: భద్రాచలం కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతానికి న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ గోండ్వానా సంక్షేమ పరిషత్ ప్రతినిధులు సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల కన్వీనర్ సోందే వీరయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే స్థానిక ఆదివాసి యువతకు న్యాయ విద్య అందుబాటులో ఉండాలని అన్నారు. భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటుతో ఆదివాసి యువత చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల అరాచకాలు పెరుగుతున్నాయని, వెంకటాపురం మండలంలో ఇటీవల జరిగిన దాడి ఘటన ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే యువత చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంత విద్యావ్యవస్థ కూడా రోజురోజుకూ బలహీనపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ చట్టాల అమలుపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటుపై అసెంబ్లీలో కూడా డిమాండ్ లేవనెత్తాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, సన్యాసి తదితరులు పాల్గొన్నారు.









