ఆదివాసీ కుటుంబంపై దాడిని ఖండిస్తూ రాస్తారోకో
వలస గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
వెంకటాపురం నూగూరు, మే 19, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ కుటుంబంపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. తలండి రాంబాబు కుటుంబంపై జరిగిన దాడి యావత్తు ఆదివాసీ సమాజంపై దాడిగా భావిస్తున్నామని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి తెలిపారు. సుమారు 300 మంది ఆదివాసీలు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేయడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనకు బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎల్టీఆర్ (1/70) చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలని జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.









