ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రజాప్రతినిధుల తోడ్పాటు అవసరం
నాణ్యమైన విద్య కోసం సమిష్టి కృషి చేయాలి
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు, మే 13, తెలంగాణ జ్యోతి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు చురుకైన తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక విద్యా వారోత్సవాల సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య ప్రమాణాలకు చిరునామాగా నిలుస్తున్నాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలపై గ్రామాలు, మున్సిపల్ పరిధిలో విస్తృత అవగాహన కల్పించి విద్యార్థుల చేరికలను 100 శాతానికి చేర్చేలా కృషి చేయాలన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. సమాజ నిర్మాణానికి పాఠశాలలు బలమైన పునాది అని, నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమంతో ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలకు సహకరిస్తే తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా లైబ్రరీల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామపంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కార్యదర్శులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేసి పనులను వేగవంతం చేయాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









