99 రోజుల పనులు… కాగితాలకే పరిమితం..?
అమలుపై అనుమానాలు.. స్థలంలో మార్పు లేదంటున్న ప్రజలు
కన్నాయిగూడెం, ఏప్రిల్24, తెలంగాణజ్యోతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై కన్నాయిగూడెం మండలంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని రికార్డులు చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాకపోవడం, మరికొన్ని చోట్ల మధ్యలోనే ఆగిపోవడం వంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు కాగితాలపై పనులు పూర్తి అయినట్లు చూపిస్తూ భూమిపై మాత్రం పనులు కనిపించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. నిధుల వినియోగంపై పారదర్శకత లేకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా ప్రణాళిక లక్ష్యాలు దెబ్బతింటున్నాయని ప్రజలు అభిప్రాయప డుతున్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే 99 రోజుల పనులు కేవలం కాగితాలకే పరిమితం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.









