భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి
పోరాటమే మార్గం..యువతకు ఉద్యమ పిలుపు..
వెంకటాపురం, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం పోరాటంతోనే సాధ్యమని జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం గ్రామంలో బుధవారం మడకం ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన ఆదివాసి యువత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాల ఏర్పాటు ద్వారా ఆదివాసి యువతకు చట్టాలపై అవగాహన పెరిగి భూములకు రక్షణ లభిస్తుందని తెలిపారు. జీఎస్పీ పోరాటాల ద్వారానే భద్రాచలంలో డిగ్రీ కళాశాల, ఎస్ఎంఎస్ హాస్టల్, బీఈడీ కళాశాల సాధించుకున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం అతిపెద్ద ఆదివాసి నియోజకవర్గమని పేర్కొంటూ గత ప్రభుత్వాల విధానాలను విమర్శించారు. 1976లో ఎమర్జెన్సీ సమయంలో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం ఆదివాసులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ఏరియాల్లో ఆదివాసి చట్టాలను అమలు చేయాలని, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించాలని సూచించారు. న్యాయ కళాశాల ఏర్పాటు వరకు ఉద్యమాలను ఉధృతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మడకం పాపారావు, అరుణ్ పండ, గణపతి, శ్రీను, మడకం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.









