రక్తదానం ప్రాణదానంతో సమానం : కొప్పుల మురళి
దివంగత మిత్రుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం
21 మంది దాతల సేవాభావం
వెంకటాపురం, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: రక్తదానం ప్రాణదానంతో సమానమని మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ కొప్పుల మురళి పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రంగరాజపురం కాలనీ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దివంగత మిత్రులు శ్రీకాంత్, తుమ్మ కార్తిక్, కోడిరెక్కల అన్వేష్, రాయవరపు ప్రకాష్ జ్ఞాపకార్థం ఈ శిబిరాన్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అమ్మ జన్మనిస్తే.. మనం చేసే రక్తదానం ఆపదలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదిస్తుంది” అని అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణీలు, తలసేమియా, సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న చిన్నారులకు అత్యవసర సమయంలో రక్తం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. వేసవి కాలంలో బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ శిబిరంలో యువకులతో పాటు మహిళలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. మొత్తం 21 మంది దాతలు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు, షీల్డ్లు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆశిష్, ల్యాబ్ టెక్నీషియన్ పార్ధు, ట్రస్ట్ సభ్యులు కిరణ్, నాగార్జున, భార్గవ్, మహేష్, నిర్మల, రంగరాజపురం కాలనీ యువత, ఆశా వర్కర్లు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









