పురుగుమందు నీరు తాగి గేదె మృతి
రైతుల నిర్లక్ష్యంపై ఆందోళన
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 16 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం గోదావరి లంకలో పురుగు మందు కలిసిన నీరు తాగి గేదె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పంటలు పూర్తయిన తర్వాత రైతులు నిర్లక్ష్యంగా వదిలేసిన పురుగు మందు డబ్బాలు, ప్యాకెట్లు, డ్రమ్ములలో మిగిలిన నీరు పశువులకు ప్రాణాంతకంగా మారుతోంది. మొక్కజొన్న చేనులో వదిలిన డ్రమ్ములోని నీటిని తాగిన బలిష్టమైన పాడిగేద కొద్దిసేపటికే గిలగిల కొట్టుకుని అక్కడికక్కడే చనిపోయినట్లు రైతులు తెలిపారు. ఎండాకాలం కారణంగా పశువులను వదిలివేసిన పొలాల వైపు తోలడంతో, ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.60 వేల విలువైన గేదె మృతి చెందినట్లు యజమాని వాపోయాడు. పంట పొలాల్లో వాడిన పురుగుమందు డబ్బాలు, అవశేషాలను భూమిలో పాతిపెట్టడం లేదా పూర్తిగా ధ్వంసం చేయాలని, లేకపోతే మరిన్ని మూగజీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పశువుల యజమానులు వాణిజ్య పంటల రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.









