ములుగు జిల్లాలో ప్రారంభమైన ‘మన ఇసుక వాహనం’ స్కీం
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం : జిల్లా కలెక్టర్ దివాకర
ములుగు, ఏప్రిల్ 9 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాలో “మన ఇసుక వాహనం” స్కీం నేటి నుంచి అమలులోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. జిల్లాలోని 10 మండలాల్లో ఈ పథకం అందుబాటులోకి తెచ్చి, సాధారణ ప్రజలు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ నిర్మాణ అవసరాలకు కావలసిన ఇసుకను కనిష్ట ధరకు నేరుగా సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక పంపిణీలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రైవేట్ దళారులకు అవకాశం లేకుండా ప్రభుత్వమే నేరుగా వినియోగదారులకు ఇసుకను అందించనుందని చెప్పారు. వినియోగదారులు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుని ఇంటి వద్దే ఇసుక పొందే విధంగా సౌకర్యం కల్పించామని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ల ద్వారా సరఫరా జరుగుతుందని, రవాణా దూరాన్ని బట్టి ధర నిర్ణయించినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్, సమాచారం కోసం స్థానిక తహసిల్దార్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ జి, డిఆర్డిఓ చంద్రశేఖర్ రెడ్డి, మైన్స్ అధికారి జయరాజు, హౌసింగ్ పీడీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










