వెంకటాపురంలో రెడ్ రిబ్బన్ ర్యాలీతో హెచ్ఐవిపై అవగాహన
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 9, తెలంగాణ జ్యోతి: రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య, ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం సామాజిక వైద్యశాల ఆధ్వర్యంలో గురువారం రెడ్ రిబ్బన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవి/ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివాజీ మాట్లాడుతూ హెచ్ఐవి ఒక సంక్రమణ వ్యాధి అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చని తెలిపారు. రక్షణలేని లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్తం, తల్లి నుంచి శిశువుకు వ్యాప్తి ప్రధాన కారణాలని పేర్కొన్నారు. చేతులు కలపడం, కలిసి ఉండడం, ఆహారం పంచుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తి కాదని స్పష్టం చేశారు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, చికిత్స పొందడం ద్వారా హెచ్ఐవి ఉన్నవారు కూడా ఆరోగ్యంగా జీవించగలరని తెలిపారు. హెచ్ఐవి బాధితులపై వివక్ష చూపకుండా వారికి మద్దతు ఇవ్వడం సమాజ బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఎస్. శాంత కుమారి, నర్సింగ్ అధికారులు బి. శ్రీనివాస్, కె. వరలక్ష్మి, సిబ్బంది మాదరి శిరీష, కుప్పిలి రాధా స్వామి, గణేష్, బాలరాజు, బాలాజీ, రాజు తదితరులు పాల్గొన్నారు.









