వెంకటాపురంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 4, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా జీసస్ సర్వెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరెడ్డి జండా ఊపి ప్రారంభించగా, గ్రోమోర్ కంపెనీ నుండి ప్రధాన రహదారి మీదుగా మార్కెట్ యార్డ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ముర్రం డేవిడ్ మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు జన్మించారని, ప్రేమ, కరుణ భావాలతో అందరూ జీవించాలని సూచించారు. యేసు ప్రభువు చేసిన త్యాగాలను కొనియాడు తూ ఆయన జీవితం మానవాళికి ఆదర్శమని తెలిపారు. ఈ ర్యాలీలో మండల కేంద్రానికి చెందిన క్రైస్తవ సహోదరులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల ఫెలోషిప్ కార్యదర్శి కే డానియల్, కోశాధికారి సిహెచ్ కొర్నిల్, ఇతర సేవకులు పాల్గొన్నారు.









