స్వాతంత్ర వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రకళ
ములుగు, మార్చి 23, తెలంగాణ జ్యోతి: స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలని మున్సిపల్ చైర్ పర్సన్ చింత నిప్పుల చంద్రకళ భిక్షపతి పిలుపునిచ్చారు. ఆయన వర్ధంతి సందర్భంగా ములుగు పట్టణంలోని రాధాకృష్ణ హాస్పిటల్లో సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ లు సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రకళ బిక్షపతి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశం కోసం 23ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ వంటి మహనీయులను స్మరించుకుంటూ రక్తదానం చేయడం గొప్ప విషయమని, యువత ఆయన పోరాట స్ఫూర్తిని అనుసరించాలని పిలుపునిచ్చారు. ములుగు సీఐ డి.సురేష్ మాట్లాడుతూ నాటి యువత దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిందని, నేటి యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భగత్ సింగ్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సీఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో భగత్ సింగ్ కీలక పాత్ర పోషించారని, ఆయన ఇచ్చిన ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఆయన ఆశయాలను కొనసాగించడం అవసరమని, యువత సమాజ మార్పు కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఆసియా షాహీన్ రియాజ్ మీర్జా, కౌన్సిలర్లు కుద్బుద్దీన్, ఓం ప్రకాష్, జన్ను రవి, రత్నం ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ, సద్దాం హుస్సేన్, చింతరాజు తదితరులు పాల్గొన్నారు.









