అమ్మ అసోసియేషన్కు రెండు అత్యుత్తమ సేవా అవార్డులు
అమ్మ ఫౌండేషన్ సభ్యులకు అభినందనల వెల్లువ
వెంకటాపురం నూగూరు, మార్చి 23, తెలంగాణ జ్యోతి: సమాజ సేవ పట్ల నిబద్ధత, నాణ్యత, అంకితభావంతో ముందుకు సాగుతున్న మా ఆదివాసీ మిత్రుల మానవత అసోసియేషన్ “అమ్మ ఫౌండేషన్”కు రెండు ప్రతిష్టాత్మక గుర్తింపులు లభించాయి. ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్తో పాటు నీతి అయోగ్ ఎన్జీవో దర్పణ్ ఎన్రోల్మెంట్ పొందడం సంస్థకు గర్వకారణంగా నిలిచింది. ఇవి కేవలం అవార్డులు మాత్రమే కాకుండా, అమ్మ ఫౌండేషన్ సేవలపై సమాజం మరియు ప్రభుత్వానికి ఉన్న విశ్వాసానికి ప్రతీకలని పలువురు అభినందించారు. ఈ గుర్తింపులతో సంస్థ బాధ్యత మరింత పెరిగిందని, సమాజ సేవ, అభివృద్ధి, విద్య తదితర రంగాల్లో మరింత శక్తివంతంగా ముందుకు సాగుతామని అమ్మ ఎన్జీవో ఫౌండర్, చైర్మన్ డాక్టర్ పీర్ల కృష్ణ బాబు తెలిపారు. సమాజ సేవ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “సర్వీస్ విత్ కమిట్మెంట్ – క్వాలిటీ విత్ పర్పస్” అన్నదే అమ్మ అసోసియేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు సర్టిఫికెట్లను ఆయన స్వీకరించారు.









