వెంకటాపురం గ్రామసభకు అధికారుల గైర్హాజరు
వెంకటాపురం నూగూరు, మార్చి 20, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మేజర్ పంచాయతీ గ్రామసభకు వివిధ శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం నిర్వహించిన గ్రామసభపై ముందస్తు సమాచారం సరైన విధంగా ఇవ్వలేదని, తూతూ మంత్రంగా మైక్ ద్వారా ప్రకటించారని గ్రామస్తులు మండిపడ్డారు. అధికారులు లేకుండా సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నిస్తూ సభలో పాల్గొన్న కొద్దిమంది ప్రజలు నిర్వాహణపై నిలదీశారు. మీడియాకు కూడా సమాచారం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్ తాటి సరస్వతి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ఉప సర్పంచ్ షర్ఫుద్దీన్, వార్డు సభ్యులు హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికను వివరించారు. విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ హనుమదాస్ మాట్లాడుతూ విద్యుత్ లేని గిరిజన కుటుంబాలకు కేంద్ర పథకం ద్వారా ఉచిత మీటర్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారిపై ఉన్న పాత మర్రి చెట్లు ప్రమాదకరంగా మారాయని, వాటిని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రకళ అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని కోరగా, మర్రిగూడెం అంగన్వాడీ భవనం పాడైపోయిందని కొత్త భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. హాజరుకాని శాఖలపై మండల అధికారికి నివేదిక సమర్పిస్తామని కార్యదర్శి తెలిపారు. మరో రెండు నెలల్లో సెంట్రల్ లైటింగ్కు నిధులు మంజూరయ్యే అవకాశముందని తెలిపారు. పంచాయతీ ఆదాయాన్ని పెంచేందుకు ఇంటి, వ్యాపార పన్నులు సకాలంలో చెల్లించాలని గ్రామసభ తీర్మానించింది.






