గ్రామ గ్రామాన ఘనంగా ఉగాది వేడుకలు
ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు – భక్తుల రద్దీ
వెంకటాపురం, మార్చి19, తెలంగాణజ్యోతి : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించగా, భక్తజనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గ్రామ గ్రామాన, ఇంటింటా ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకుంటూ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని పంచుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, మండల కేంద్రమైన వెంకటాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయాల్లో వేద పండితులు పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. పంచాంగ భవిష్యవాణి వినేందుకు ఆబాల గోపాలం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పల్లకి సేవను మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా నిర్వహించగా, భక్తులు శుద్ధి జలంతో స్వాగతం పలికి పసుపు, కుంకుమలతో అర్చనలు చేసి అర్చకుల ఆశీర్వాదాలు పొందారు.






