విద్యార్థులకు రైతు జీవితం నేర్పిన విజన్ స్కూల్
వెంకటాపురం, ఫిబ్రవరి 06 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని విజన్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ బాహుబలేంద్రుని వెంకటరామారావు నేతృత్వంలో విద్యార్థులను సమీపంలోని మొక్కజొన్న పంట సాగు జరుగుతున్న వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లారు. అక్కడ మొక్కజొన్న పంట నిర్మాణం, విత్తనం, మొలకెత్తే విధానం, పంట సాగు ప్రక్రియతో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు పడే కష్టాన్ని ప్రత్యక్షంగా వివరించారు. అలాగే ఆహార ధాన్యాల విలువ, దేశానికి వెన్నుముకైన రైతు ప్రాముఖ్యత, వ్యవసాయ రంగం మన జీవితానికి ఎంత కీలకమో విద్యార్థులకు స్పష్టంగా అవగాహన కల్పించారు. అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ రంగానికి చెందినవారేనని గుర్తుచేస్తూ, వారి శ్రమకు గౌరవం ఇవ్వడం, ఆహారాన్ని వృథా చేయకూడదనే భావనను విద్యార్థులలో నాటే ప్రయత్నం చేశారు. రైతే రాజు అనే భావనతో పాటు మనమంతా భూమితో ముడిపడ్డ కుటుంబాల నుంచే వచ్చామని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దమ రాణి, నాగమణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విజన్ స్కూల్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం పాఠ్యాంశాలతో పాటు ప్రాయోగిక విద్యకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు బాహుబలేంద్రుని వెంకటరామారావు తెలిపారు.






