పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి
సూరవీడు సర్పంచ్ ఇర్ప మురళి
వెంకటాపురం,ఫిబ్రవరి5,తెలంగాణజ్యోతి: పాఠశాలల్లో విద్యా ప్రమాణా లు పెంచడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం, అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నిరంతర కృషి చేయాలని సూరవీడు గ్రామ సర్పంచ్ ఇర్ప మురళి అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు పంచాయతీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలను గురువారం ఆయన ఉపసర్పంచ్ కొరసా మురళీకృష్ణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య పెరగాలంటే తరచూ పేరెంట్స్, మదర్స్ కమిటీలతో పాటు గ్రామ పెద్దలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ‘మన ఊరు – మనబడి, మన విద్యార్థులు – మన అంగన్వాడి కేంద్రాలు’ అనే భావనతో అంకిత భావంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లను ఆయన అభినందించారు. జి.పి. పరిధిలోని పాఠశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, నూతన భవనాలు, కాంపౌండ్ వాల్, విద్యుత్, మంచినీటి వసతి వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ ఇరపా మురళి, ఉపసర్పంచ్ మురళీకృష్ణ హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి పలు సూచనలు చేశారు.






