మేడారం జాతర రహదారి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
కాటారం, జనవరి 23,(తెలంగాణ జ్యోతి): మేడారం జాతర సందర్భంగా భక్తుల రాకపోకల సౌలభ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ నార్లాపూర్ నుండి భూపాలపల్లి మరియు నార్లపూర్ నుండి కాల్వపెల్లి మీదుగా కాటారం వరకు ఎగ్జిట్ మార్గాన్ని పరిశీలించారు. జాతర నుంచి తిరిగి వచ్చే వాహనాలు సాఫీగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించేలా రహదారి పరిస్థితులను పరిశీలించి, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, జాతర విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందికి మెస్ సౌకర్యాలు, నివాస ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మేడారం నుంచి నార్లాపూర్ మీదుగా భూపాలపల్లి వచ్చే మార్గంలో మూల మలుపులు అధికంగా ఉన్నందున వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. మూల మలుపుల వద్ద వాహనదారులకు ముందుగా హెచ్చరికలు అందించేలా అవసరమైన ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అలాగే జాతర సమయంలో పశువులను, రోడ్లపైకి రాకుండా చూడాలని వాటివల్ల రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వాటిని రాకుండా చూడాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జాతర సందర్భంగా రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రమాదాల నివారణకు భక్తులు మరియు వాహనదారులు పోలీస్ సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.






