వెంకటాపురం బస్ స్టేషన్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
వెంకటాపురం, జనవరి 21 (తెలంగాణ జ్యోతి): మేడారం మహా జాతర సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం బస్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రత్యేక ఆర్టీసీ బస్సుల నిలుపుదలతో పాటు ప్రయాణికుల సౌకర్యాల కోసం బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి జుమ్మిలాల్ పర్యవేక్షణలో వెంకటాపురం మేజర్ పంచాయతీ కార్మికులు బస్ స్టేషన్ ఆవరణను శుభ్రం చేశారు. పంచాయతీ కార్యదర్శి జి. ప్రవీణ్ ఆధ్వర్యంలో బస్ కాంప్లెక్స్ ఆవరణను పరిశుభ్రం చేయించి, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల పైపు నుంచి జాతరకు వచ్చే ప్రత్యేక బస్సులతో పాటు వెంకటాపురం కేంద్రంగా నడిచే స్పెషల్ బస్సుల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆర్టీసీ స్థలంలో ప్రయాణికుల సౌకర్యార్థం మంచినీటి వసతి, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా, ఎంపీడీవో ఆదేశాల మేరకు జాతరకు వారం రోజుల ముందుగానే ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపట్టినట్లు తెలిపారు.






