నాగోబా జాతర ప్రారంభంలో పాల్గొన్న మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో అట్టహాసంగా నాగోబా జాతర
ఆదిలాబాద్, జనవరి 20 (తెలంగాణ జ్యోతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన నాగోబా జాతరలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, నాగోబా జాతర సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రాష్ట్రంలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరగా నిలుస్తోందని పేర్కొన్నారు. మేస్రం వంశీయులు గంగా జలాలతో నాగోబాను అభిషేకించిన అనంతరం జాతర వేడుకలు అధికారికంగా ప్రారంభమవుతాయని, ఆదివాసీ సంప్రదాయాల డోలు, సన్నాయిల మోగుడు, దివిటీల కాంతుల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ జాతర ప్రత్యేకతని తెలిపారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు ఈ జాతరకు తరలివస్తారని, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు నాగోబా జాతరకు రావడం తనకు ఎంతో అదృష్టమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, రాష్ట్ర, జిల్లా నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







