రాజకీయ కక్షతోనే హరీష్ రావుపై సిట్ నోటీసులు – సానికొమ్ము రమేష్ రెడ్డి
ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ములుగు, జనవరి 20 (తెలంగాణ జ్యోతి): రాజకీయ కక్షతోనే హరీష్ రావుపై సిట్ నోటీసులు ఇచ్చారంటూ బీఆర్ఎస్ ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ములుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి వాస్తవాలు లేవని సుప్రీంకోర్టే స్పష్టంగా పేర్కొని కేసును కొట్టివేసినప్పటికీ, మళ్లీ సిట్ విచారణ నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ రాజకీయ కక్షపూరిత దురుద్దేశానికి నిదర్శనమని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి బొగ్గు గనుల కుంభకోణాన్ని హరీష్ రావు బయటపెట్టినందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న హరీష్ రావును రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు, నోటీసులతో వేధించడం ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య అని విమర్శించారు. న్యాయవ్యవస్థలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్రమౌళి, భూక్య అమర్ సింగ్, కవ్వంపల్లి బాబు, దూడబోయిన శ్రీనివాస్, వాంకుడోతు రాందాస్, అబ్బాపూర్ ఉపసర్పంచ్ అన్న తిరుపతి, కుమార్ పాడియా, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.






