ప్రభుత్వ చేయుతతో మారిన గ్రామీణ మహిళ జీవితం
హైదరాబాద్, జనవరి 20 (తెలంగాణ జ్యోతి): జేసీబీ వంటి భారీ యంత్రాలు పురుషులే నడపాలనే భావనకు చెక్ పెట్టుతూ గ్రామీణ మహిళ సాధికారతకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది జనగాం జిల్లా జనగాం మండలం ఎరుగొల్లపాడు గ్రామానికి చెందిన పాలమాకుల అరుణ. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, సమాజపు అడ్డంకులను ఆత్మవిశ్వాసం, శ్రమతో అధిగమించిన ఆమె ప్రయాణం నేడు అనేక మహిళలకు స్పూర్తిగా మారింది. పదో తరగతి వరకు చదివిన అరుణ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, 2012లో వివాహం అనంతరం ఎలాంటి కుటుంబ మద్దతు లేకపోయినా భర్త నాగరాజుతో కలిసి జీవితం నిర్మించుకునే ప్రయత్నం ప్రారంభించారు. నాగరాజు జేసీబీ డ్రైవర్గా పనిచేయగా, అరుణ వ్యవసాయ కూలీగా, కుట్టు పనులు చేస్తూ కుటుంబాన్ని నడిపించారు. 2013లో స్వయం సహాయక సంఘంలో (SHG) చేరిన అరుణకు అది జీవిత మలుపుగా మారింది. 2014లో SHG రుణంతో పాత అప్పులు తీర్చుకుని ఆర్థిక స్థిరత్వం సాధించారు. 2019లో SHG బ్యాంక్ లింకేజ్, గ్రామ సంఘం, స్త్రీ నిధి సహకారంతో గ్రామంలోనే తొలి జేసీబీని కొనుగోలు చేయడం విశేషం. భర్త ప్రోత్సాహంతో అరుణ స్వయంగా జేసీబీ నడపడం నేర్చుకుని 2024లో విజయవంతంగా డ్రైవింగ్ పూర్తి చేయగా, నేడు గంటకు రూ.1,000–1,200 వరకు, రోజుకు సగటున రూ.4,000 నుంచి రూ.5,000 ఆదాయం పొందుతున్నారు. SHGల సహాయంతో కుటుంబం ఇప్పటివరకు రూ.22.10 లక్షల రుణాలు పొందుతూ వ్యవసాయం, కిరాణా దుకాణం, టాటా ట్రాలీ, బ్యాగుల తయారీ యూనిట్ వంటి కార్యకలాపాలతో స్వయం ఆధారంగా నిలబడింది. ప్రస్తుతం అరుణ SHG గ్రూప్ లీడర్గా, VO అధ్యక్షురాలిగా, మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేస్తూ అనేక మహిళలకు స్వయం ఉపాధి మార్గం చూపుతున్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అరుణను కలిసిన డా. దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, “జేసీబీ నడుపుతున్న అరుణ ధైర్యం ప్రతి మహిళకు స్పూర్తిదాయకం. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా లక్షలాది మంది అరుణలను తయారు చేయడమే మా ప్రజా ప్రభుత్వ సంకల్పం” అని పేర్కొన్నారు.






