మేడారం మహాజాతరలో తప్పిపోతారనే భయం లేదు
ఏఐ టెక్నాలజీ, డ్రోన్లు, జియోట్యాగ్తో భక్తులకు పూర్తి భద్రత
ములుగు, జనవరి 19 (తెలంగాణ జ్యోతి): తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను ఈసారి అత్యంత వైభవంగా, సాంకేతికత ఆధారంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక పర్యవేక్షణలో సాగుతున్న ఏర్పాట్లలో భాగంగా, సీఎం ఏ. రేవంత్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరలో ‘మేడారం 2.0’ కాన్సెప్ట్తో ఏఐ ఆధారిత ‘టీజీ-క్వెస్ట్’ డ్రోన్ వ్యవస్థ ద్వారా 30 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ రహదారులపై నిరంతర నిఘా ఉంటుంది. హీలియం బెలూన్లకు అమర్చిన పాన్–టిల్ట్–జూమ్ కెమెరాలు రద్దీని విశ్లేషించి తొక్కిసలాట ప్రమాదాలను ముందే గుర్తిస్తాయి. దాదాపు 13 వేల మంది పోలీసు సిబ్బంది సాంకేతిక నిఘాలో విధులు నిర్వహించనుండగా, ఈసారి మూడు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ విధానాన్ని వొడాఫోన్–ఐడియా సహకారంతో అమలు చేస్తున్నారు. పస్రా, తాడ్వాయి మార్గాల్లో వృద్ధులు, పిల్లలకు క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్లు కట్టి, తప్పిపోయిన వెంటనే వివరాలు గుర్తించేలా చర్యలు చేపట్టారు. తెలుగు, ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళ భాషల్లో నమోదు సౌకర్యం కల్పించగా, శాంతిభద్రతల పరిరక్షణకు 12 ప్రత్యేక క్రైమ్ బృందాలు, ఫేస్ రికగ్నిషన్, రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్లు సిద్ధం చేశారు.






