మల్లూరు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు : మంత్రి సీతక్క
మంగపేట, జనవరి 15 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ప్రకృతి సంపదకు భంగం కలగకుండా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మల్లూరు గుట్టపై ఎవరూ ఎక్కకుండా, చెట్లు నరుకకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని సూచిస్తూ, సహజ సిద్ధ వనరులను కాపాడుకుంటూనే ఆలయాభివృద్ధి చేపడతామని ఆమె స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా గురువారం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. మేడారం జాతర సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ములుగు జిల్లాలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న మంత్రి, త్వరలోనే మల్లూరు గుట్టపైకి రోప్వే, ఘాట్ రోడ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న సహజ వనమూలికలతో కూడిన గుట్టలు, చింతామణి జలధార భక్తులను ఎంతో ఆకట్టుకుంటాయని ఆమె చెప్పారు. అదేవిధంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనులు, గద్దెల పునరుద్ధరణ ప్రారంభోత్సవానికి ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు.






