ల్యాండ్ స్కేపింగ్ సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు ప్రతినిధి, జనవరి3, తెలంగాణజ్యోతి : శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఆలయ పరిసరాలలో ల్యాండ్ స్కేపింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శనివారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర ఆలయ పునరుద్ధరణ పనులు,ల్యాండ్ స్కేపింగ్ పనులను జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్., డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆలయ పరిసరాలలో ల్యాండ్ స్కేపింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, భక్తులను ఆకట్టుకునే విధంగా సహజ సిద్ధ ప్రకృతి వనంలా ఉండే విధంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో ప్రాకారపు రాతి స్తంభాలపై బ్రాకెట్స్ లను, ప్రధాన ఆర్చి రాతి స్తంభాలపై పిటి బీమ్స్ వెంటనే అమర్చాలని అన్నారు. జాతర సమీపిస్తున్న తరుణంలో నిర్దేశించిన గడువులోపు పనులను పూర్తి చేయాలని, వనదేవతల సందర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని , ఆలయ ప్రాంగణ పరిసరాలలో, జంపన్న వాగు, ఆర్టీసీ బస్ స్టాండ్ లలో ఎప్పటికప్పుడు వ్యర్థాల సేకరణ, పరిశుద్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటయ్య, దేవాదాయ శాఖ అధికారి వీరస్వామి, ఎఫ్ డి ఓ రమేష్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






