ఆపరేషన్ స్మైల్ చిన్నారుల భవిష్యత్తుకు భరోసా
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకునే వారిని ఉపేక్షించేది లేదు
డీఎస్పీ కిషోర్ కుమార్
ములుగు , జనవరి 02 (తెలంగాణ జ్యోతి ): ఆపరేషన్ స్మైల్ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప కార్యక్రమమని, మైనర్ పిల్లలను పనిలో పెట్టుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆపరేషన్ స్మైల్ ములుగు జిల్లా ఇన్చార్జి డీఎస్పీ కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం తాడ్వాయి మండలంలోని మేడారం హరిత హోటల్ సమావేశ మందిరంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ములుగు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ అనాగరిక చర్యని, పిల్లలు చదువుకుంటేనే వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని తెలిపారు. మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కార్మికుల్లో పిల్లలు ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వసుధ మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు పిల్లలు తప్పనిసరిగా బడి లోనే ఉండాలని, బాల కార్మికులను గుర్తించి తిరిగి చదువుల వైపు మళ్లించాలని తెలిపారు. ఈ సమావేశంలో డా. మధు, ఎస్ఐ ఇమ్మాన్యూయేల్, ఏఎల్ఓ వినోద, పోలీస్, బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






