శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర వైద్య ఏర్పాట్లపై విస్తృత సమావేశం
ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి
వరంగల్, జనవరి (తెలంగాణ జ్యోతి): జనవరి మాసం చివర్లో జరగ నున్న శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్పెషలిస్ట్ డాక్టర్లతో సమగ్ర సేవలు అందించాలని నిర్ణయించారు. ములుగు జిల్లాకు సమీపంగా ఉన్న ములుగు, నర్సంపేట, భూపాలపల్లి మెడికల్ కాలేజీలు మరియు అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్లను డిప్యూటేషన్పై జాతర వైద్య సేవలకు వినియోగించుకోవాలని, అలాగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని వైద్యాధికారులు, సూపర్వైజర్లు, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలను పూర్తిస్థాయిలో వినియోగించాలని నిర్ణయించారు. ఈసీజీ టెక్నీషియన్లు, ఎంఎన్ఓలను ఎంజీఎం హాస్పిటల్, ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ఏటూరునాగారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నుంచి తీసుకోవాలని పేర్కొన్నారు. మేడారం జాతరలో ఫస్ట్ రిఫరల్ సెంటర్గా 50 పడకలతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం, ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో సెకండరీ లెవెల్ వైద్య సేవల కోసం 20 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం, టెర్షియరీ స్థాయి వైద్య సేవలను ఎంజీఎం హాస్పిటల్లో అందించాలనే అంశాలపై చర్చించారు. జాతరకు అవసరమైన మానవ వనరులు, మందులు, పరికరాలు సమకూర్చుకుని మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేసి భక్తుల సేవలో వైద్య ఆరోగ్యశాఖ ముందువరుసలో నిలవాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ అప్పయ్య, డాక్టర్ గోపాల్ రావు, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ రవిరాజ్, డాక్టర్ మల్లికార్జున్, జనగాం సూపరింటెండెంట్ డాక్టర్ గోపాలరావు, డాక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొత్తగూడెం డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ నరేందర్, డాక్టర్ లక్ష్మీదేవి, డాక్టర్ మురళి, డాక్టర్ మధుకర్ యాదవ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, డెమో అశోక్ రెడ్డి, ప్రసాద్, సంపత్ ప్రభాకర్, అంజద్ అలీ, నాగరాజు, సదానందం తదితరులు పాల్గొన్నారు.






